ఐపీఎల్ ముగియగానే ఇంగ్లాండ్‌కు కోహ్లీ

భారత్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జూన్ 14న బెంగళూరులో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు.

Last Updated : Mar 24, 2018, 03:50 PM IST
ఐపీఎల్ ముగియగానే ఇంగ్లాండ్‌కు కోహ్లీ

భారత్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జూన్ 14న బెంగళూరులో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2018 సీజన్ ముగియగానే కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కు పయనం అవుతున్నాడు.

ఇంగ్లాండ్ పయనానికి ముందే ఆ దేశ పరిస్థితులపై అవగాహన పెంచుకొనేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ.. అక్కడి కౌంటీలలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. జూన్‌లో జరిగే  కౌంటీ క్రికెట్‌లో  విరాట్ కోహ్లీ సర్రే జట్టు తరపున బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది జులైలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు ముందుగా వెళ్లకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులోని కీలక ఆటగాళ్లను నెల రోజులు ముందుగానే అక్కడికి పంపనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

కొహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో..  జూన్‌ 14న బెంగళూరులో అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు దూరం కానున్నాడు. గతంలో కపిల్ దేవ్ కూడా కోహ్లీ కౌంటీల్లో ఆడాలని సూచించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని టీమిండియా క్రికెటర్లు ఛటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మలు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. పుజారా కౌంటీల్లో యార్క్‌షైర్‌ జట్టు తరఫున ఆడనున్నాడు.

కాగా, ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్‌ 7న ప్రారంభం కానుంది. కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తన తొలి మ్యాచ్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 8న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరగనుంది.

Trending News