నేను అన్నం తింటుంటే.. నాన్న వాతలు పెట్టాడు: నాలుగేళ్ల చిన్నారి కన్నీటిగాథ

నాలుగేళ్ల చిన్నారిపై కన్నతల్లి, ఆమె ప్రియుడి పైశాచిక దాడి

Last Updated : Sep 11, 2018, 04:17 PM IST
నేను అన్నం తింటుంటే.. నాన్న వాతలు పెట్టాడు: నాలుగేళ్ల చిన్నారి కన్నీటిగాథ

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారిని ఆమె తల్లి, తల్లి ప్రియుడు ఇద్దరూ కలిసి దారుణంగా కొట్టి హింసించారు. భోజనం చేస్తోన్న చిన్నారిని మానవత్వం మరిచి గంటెతో కాల్చి వాతలు పెట్టారు. ఇష్టం వచ్చినట్టు గిల్లారు. తన కన్న తల్లే ఆమె ప్రియుడితో కలిసి తనని హింసిస్తుండగా, తనను ఆ ప్రత్యక్ష నరకం నుంచి కాపాడిన బాలల హక్కుల స్వచ్చంద సంస్థ ప్రతినిధులకు తాను అనుభవించిన కష్టాలు చెప్పుకుని బోరుమంది ఆ చిట్టితల్లి. తాను అన్నం తింటుండగా తన తండ్రి(తల్లితో సహ జీవనం చేస్తోన్న భాగస్వామి) గంటెతో కాల్చి వాతపెట్టాడని, ఆ కాలిన గాయాలను చూపిస్తూ ఆ చిట్టితల్లి వెక్కివెక్కి ఏడవడం అక్కడున్న వాళ్లందరికి కన్నీళ్లు తెప్పించింది. 

చిన్నారిని ఆమె తల్లి, ప్రియుడు కలిసి హింసించడం చూసి తట్టుకోలేకపోయిన ఇరుగుపొరుగు వారు స్థానిక రాజకీయ నాయకుడికి సమాచారం అందించారు. ఇదే విషయం ఆ రాజకీయ నేత బాలల హక్కుల సంఘం నేత అచ్యుత రావుకు తెలియజేయగా.. అతడు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన సదరు ఎన్జీవో.. చిన్నారిని హింసిస్తున్న ఆ తల్లి, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ చిన్నారిని వారి నుంచి రక్షించారు. చిన్నారిపై హింసకు పాల్పడిన ఆమె తల్లి, తల్లితో కలిసి సహ జీవనం చేస్తోన్న ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల విచారణలో తెలిసిన వివరాల ప్రకారం భర్తతో విడిపోయిన 26 ఏళ్ల యువతి గత కొంత కాలంగా తన ప్రియుడితో కలిసి ఉంటోంది. ఇటీవలే ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తగా.. ఇద్దరూ తమ కోపాన్ని అభంశుభం తెలియని ఆ చిన్నారిపై ప్రదర్శించడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

Trending News