నిరంకుశత్వానికి కలం బలం చూపించిన తెలంగాణ యోధుడు "కాళోజీ"

దమననీతికి.. దౌర్జన్యానికి ఆయన వ్యతిరేకంగా కలాన్ని ఝలిపించాడు. రాజకీయ సాంఘిక చైతన్య దీపికగా మారి తన కవిత్వంతో ప్రజాకవిగా విరాజిల్లాడు

Last Updated : Sep 10, 2018, 01:21 PM IST
నిరంకుశత్వానికి కలం బలం చూపించిన తెలంగాణ యోధుడు "కాళోజీ"

దమననీతికి.. దౌర్జన్యానికి ఆయన వ్యతిరేకంగా కలాన్ని ఝలిపించాడు. రాజకీయ సాంఘిక చైతన్య దీపికగా మారి తన కవిత్వంతో ప్రజాకవిగా విరాజిల్లాడు. "పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది" అని చాటిన కాళోజీ తెలంగాణ జీవిత చలనశీలి... ఓ వైవిధ్యమైన ఉద్యమకారుడు. ఆయన రచించిన "నా గొడవ" తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనాన్నే సృష్టించింది. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన ఆయన.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అవసరమే అని చాటారు.  ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు' అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..!

*1914, సెప్టెంబరు 9 తేదిన (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తల్లి మాతృభాష కన్నడ కాగా.. తండ్రి భాష మరాఠీ.  బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరనివాసం ఏర్పరచుకుంది. 
*1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష.
*1945లో వరంగల్ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీకి నగర బహిష్కరణశిక్ష విధించారు.
*కాళోజీ బహుభాషా కోవిదుడు. చిన్నప్పటి నుండీ తెలుగులో చదువుకున్నా.. ఆయన మరాఠీ, కన్నడం, హిందీ, ఉర్దూ భాషల్లో కూడా కవిత్వం రాశారు.
*ఆంధ్ర సారస్వత పరిషత్" వ్యవస్థాపక సభ్యుల్లో కాళోజీ కూడా ఒకరు. స్వరాజ్య పోరాటంలో విరివిగా పాల్గొన్న కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ.
*లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ గురించి కాళోజీ రాసిన  పంక్తులు ఆయన జీవితానికి కూడా వర్తిస్తాయి. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు...అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అని చాటిన కవి కాళోజీ
*1940లో రుక్మిణిభాయిని వివాహమాడారు కాళోజీ. రజకార్ల ప్రతిఘటన, స్టేట కాంగ్రెస్ సత్యాగ్రహాలు, ఆంధ్రమహసభ, తెలంగాణ రైతాంగ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, పౌరహక్కుల పోరాటం.. ఇలా అన్ని పోరాటాలలో కూడా కాళోజీ పాలుపంచుకున్నారు. విప్లవమే తన జీవిత పరమావధి అని చాటారు.
*భాషలను, యాసలను కించపరిచేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు కాళోజీ. ఎవరి వాడుక భాషల్లో వారు రాయాలన్నదే కాళోజీ సిద్ధాంతం.
*1992లో కాళోజీకి భారత రెండవ అత్యున్నత పురస్కారమై పద్మవిభూషణ్ లభించింది.
*కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు 1992లో కాళోజీకి డాక్టరేట్ ప్రదానం చేసారు. 
*అణా కథలు, నా భారతదేశ చరిత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, బాపు బాపు బాపు.. మొదలైనవి కాళోజీ కలం నుండి జాలువారిన అద్భుత రచనలు.
*ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అని చాటిన కవి కాళోజీ. 
*"సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 తేదిన తుదిశ్వాస విడిచారు. అతని మరణానంతరం ఆయన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు. 
*కాళోజీ జయంతినే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం విశేషం

Trending News