ఏపీ బడ్జెట్ 2018లో కేటాయింపులివే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్థిక బడ్జెట్ ప్రవేశబెట్టింది. 2018-19 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశబెట్టారు. 

Last Updated : Mar 8, 2018, 02:21 PM IST
ఏపీ బడ్జెట్ 2018లో కేటాయింపులివే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్థిక బడ్జెట్ ప్రవేశబెట్టింది. 2018-19 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశబెట్టారు. తన ప్రసంగంలో రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన వల్ల వస్తున్న అనర్థాలను ఆయన తెలిపారు. అయినా సరే ఈ సమస్యలను అన్నింటిని తట్టుకొని రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. కేంద్రం నుండి తగిన సహాయం అందితే మరింత ప్రగతి సాధించే అవకాశం ఉండేదని ఆయన తెలిపారు. హామీల విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో జాతీయ సగటు వృద్ధితో పోటీ పడి రాష్ట్రం వృద్ధి సాధించిందని ఆయన తెలిపారు.

బడ్జెట్ కేటాయింపులు ఇలా
బడ్జెట్ మొత్తం రూ.1,91,063.61 కోట్లు కాగా అందులో రెవెన్యూ వ్యయంను రూ.1,50,270.99 కోట్ల రూపాయలుగా.. మూలధన వ్యయంను రూ.28.678.49 కోట్ల రూపాయలుగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 21.70 శాతం బడ్జెట్ పెరిగిందని ఆయన తెలిపారు. 

*ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగ అభివృద్దికి రూ.12,352 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 35.91 శాతం అదనం. అలాగే సాగునీటి రంగానికి రూ.16,978.23 కోట్లు కేటాయించారు. గతం సంవత్సరంతో పోలిస్తే 32.95 శాతం అదనం. గ్రామీణ రంగ అభివృద్ధికి రూ.20,815 కోట్లు కేటాయించారు, ఇంధన రంగ అభివృద్ధికి  రూ.5,052.54 కోట్లు కేటాయించారు. అలాగే రైతు రుణాల మాఫీకి రూ.4,100 కోట్లు కేటాయించారు.  వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ.4,477 కోట్లు కేటాయించారు

*రవాణా శాఖకు రూ.4,653 కోట్లు,  గృహ నిర్మాణ శాఖకు రూ.3,679 కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖకు రూ.3,074.87 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000 కోట్లు కేటాయించారు. చర్మకారుల ప్రత్యేక ఉపాధి హామీ పథకం కోసం రూ.60 కోట్లు కేటాయించారు. 

*సాధారణ సేవలకు రూ.56,113.17 కోట్లు కేటాయించగా,  విద్యా రంగ అభివృద్ధికి  రూ.24,185.75 కోట్లు కేటాయించారు. 

*క్రీడలు, యువజన సేవల శాఖకు రూ.1,635.44 కోట్లు కేటాయించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగానికి గాను రూ.818.02 కోట్లు కేటాయించారు. సాంస్కృతిక రంగానికి రూ.94.98కోట్లు కేటాయించారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖకు రూ.224.81 కోట్లు కేటాయించారు. 

*కార్మిక, ఉపాధి కల్పనకు రూ.902.19 కోట్లు కేటాయించారు. చేతివృత్తుల పథకానికి, వారి ఉపాధికి రూ.750 కోట్లు కేటాయించగా, జనతా వస్త్రాల పథకంలో భాగంగా రూ.250 కోట్లు కేటాయించారు. హోంశాఖకు రూ.6,226 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవకు రూ.1000కోట్లు కేటాయించారు.

*వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ.4,477 కోట్లు కేటాయించారు.బీసీల సంక్షేమానికి రూ.12,200 కోట్లు కేటాయించారు. కాపుల సంక్షేమానికి రూ.1,000 కోట్లు కేటాయించగా, మేదరుల సంక్షేమానికి రూ.30 కోట్లు కేటాయించారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కోసం రూ.30 కోట్లు, వైశ్య సంఘాలకు రూ.30 కోట్లు  కేటాయించారు. అలాగే కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70 కోట్లు కేటాయించారు. అదేవిధంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు ట్యూషన్  ఫీజు కోసం రూ.700కోట్లు కేటాయించారు.

*చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.100 కోట్లు, బీసీలకు రూ.100 కోట్లు కేటాయించారు. సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా రూ.3,029  కోట్లు కేటాయించారు. కాపు సామాజిక విద్యార్థులకు రూ.400కోట్లు కేటాయించారు. 

*పర్యాటక శాఖ అభివృద్దికి, వాటి సంబంధిత పథకాలకు రూ.290 కోట్లు కేటాయించారు. తాగునీరు, పారిశుద్ధ్యం కోసం రూ.2,623 కోట్లు కేటాయించారు. ఫైబర్‌ గ్రిడ్‌ కోసం రూ.600 కోట్లు కేటాయించారు. మెడ్‌ టెక్‌ జోన్‌ కోసం రూ.270 కోట్లు కేటాయించారు.

*అన్నా క్యాంటీన్ల కోసం రూ.200 కోట్లు కేటాయించారు. స్టార్టప్‌ల కోసం, యువ వ్యాపారవేత్తలకు ట్రైనింగ్ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. డ్వాక్రా మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ల సరఫరా కోసం రూ.100 కోట్లు కేటాయించారు.

*అన్న అన్న అమృత హస్తం పధకంలో భాగంగా ఐదు రోజులు గుడ్లు పథకానికి రూ.266 కోట్లు కేటాయించారు. పౌష్టకాహార లోపం నియంత్రణకు రూ.360కోట్లు కేటాయించారు.

*హిజ్రాలకు ఉపాధికి, సంక్షేమానికి రూ.20కోట్లు కేటాయించారు. అలాగే న్యాయశాఖకు రూ.886 కోట్లు కేటాయించారు.

*ఎన్టీఆర్‌ జలసిరి కోసం రూ.100కోట్లు కేటాయించారు. అలాగే ఈ-ప్రగతికి రూ.200 కోట్లు కేటాయించారు.

*నిరుద్యోగ భృతికి రూ.1000కోట్లు కేటాయించారు. అలాగే ఎన్టీఆర్‌ ఫించన్లకు రూ.5,000 కోట్లు కేటాయించారు.

*మెగా సీడ్‌ పార్క్ కోసం రూ.100 కోట్లు కేటాయించారు.  స్వచ్ఛభారత్‌ కోసం రూ.1,450 కోట్లు కేటాయించారు. అలాగే విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.1,168 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణం-భూసేకరణకు రూ.575 కోట్లు కేటాయించారు.

 

 

Trending News