హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశపై టీ సర్కార్ ఫోకస్

తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న మార్గాల్లో విస్తరణ పనుల కోసం అయే వ్యయాన్ని భరించనున్న తెలంగాణ సర్కార్.

Last Updated : Mar 13, 2018, 01:52 PM IST
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశపై టీ సర్కార్ ఫోకస్

హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్ఎల్) ప్రాజెక్టు పాత్ర ఎంతో కీలకం అని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విషయంలో మరింత ప్రణాళికతో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు మార్గం పరిధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. బయోడైవర్సిటీ పార్క్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు చేపట్టనున్న అదనపు కారిడార్‌కి ఖర్చు అయ్యే నిధులని తెలంగాణ సర్కార్ భరించేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. 

ఇదే కాకుండా రాయ్‌దుర్గ్ నుంచి బయోడైవర్సిటీ పార్క్ వరకు పొడిగించనున్న రైలు మార్గానికి అయ్యే వ్యయాన్ని సైతం తెలంగాణ సర్కార్ భరించనుందని సమాచారం. ఇవి కాకుండా మిగతా మార్గాల నిర్మాణం కోసం చేసే ఖర్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. 

ప్రాథమిక నివేదిక రూపొందించిన ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ చేసిన సిఫార్సుల మేరకు ఈ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నప్పటికీ, రానున్న రాష్ట్ర కేబినెట్ స్థాయి సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకోనున్నారని మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్.. హెచ్ఎంఆర్ఎల్ రెండో దశ పనులకు సుమారు రూ.14,023 కోట్ల వ్యయం అవుతుందని అంచన వేసింది. అందులో ఎయిర్ పోర్టు వరకు పొడిగించనున్న మార్గం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.4,645 కోట్లు భరించనుంది. 

Trending News