ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూకుడు

కేటీఆర్ 2017–18లో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ పురోగతిపై రూపొందించిన వార్షిక నివేదిక ఆవిష్కరించారు.

Last Updated : Jun 2, 2018, 10:06 AM IST
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూకుడు

తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవల (ఐటీఈఎస్)లో ఎగుమతులు 9.3 శాతం వృద్ధి చెంది 93,422 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని.. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2013–14తో పోలిస్తే గతేడాది ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం 15.6 శాతం వృద్ధి రేటు సాధించిందని పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.  హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ 2017–18లో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ పురోగతిపై రూపొందించిన వార్షిక నివేదిక ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జాతీయ సగటు వృద్ధి రేటు (7–9 శాతం) కంటే కూడా తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ. 2020 నాటికి 16 శాతం వృద్ధి రేటుతో రూ.1.2 లక్షల కోట్ల వార్షిక ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు సాధించి ప్రత్యక్షంగా 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించాలని, పరోక్షంగా మరో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ అన్నారు. 1.5 లక్షల కొత్త ఐటి ఉద్యోగాల సృష్టితో ఈ వృద్ధిని సాధించామని, పరోక్షంగా 4.5 లక్షల మంది వరకు ఉపాధి పొందారని ఆయన అన్నారు.

గత ఏడాది ఐటి రంగం ద్వారా కొత్తగా 43,417 ఉద్యోగాలోచ్చాయని, దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,75,308కు పెరిగిందన్నారు. మరో 7.5 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.

అనంతరం టి-వెబ్ (టి ఫర్ తెలంగాణ), టి-సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, టీ-స్వాన్ (స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్), TSTS-ABAS (తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవలు - ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థ) లాంటి కొత్త కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఐటి రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇచ్చారు.

Trending News