Russia Ukraine War: యుద్ధ కాలాన ఆపన్న హస్తం.. కీవ్‌లో ఉచిత షెల్టర్, ఆహారం అందిస్తోన్న ఇండియన్ రెస్టారెంట్

Indian Restaurant in Kyiv offering free shelter: ఉక్రెయిన్‌పై దాదాపు గత వారం రోజులుగా రష్యా దాడులకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే. యుద్ధంలో ఇప్పటికే వందలాది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధానికి ఇంకా తెరపడకపోవడంతో ఉక్రెయిన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ సంక్లిష్ట సమయంలో ఓ ఇండియన్ రెస్టారెంట్ వారికి అండగా నిలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 05:46 PM IST
Russia Ukraine War: యుద్ధ కాలాన ఆపన్న హస్తం.. కీవ్‌లో ఉచిత షెల్టర్, ఆహారం అందిస్తోన్న ఇండియన్ రెస్టారెంట్

Indian Restaurant in Kyiv offering free shelter: రష్యా దాడులతో కకావికలమవుతోన్న ఉక్రెయిన్‌లో ఎటు చూసినా బాంబుల మోత, శిథిలమైన భవనాలే కనిపిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉక్రెయిన్ వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఆశ్రయం లేనివారు.. ఎక్కడికి వెళ్లాలో తెలియని వారి కోసం కీవ్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్ బృందం అండగా నిలుస్తోంది. ఏ దేశస్తులైనా, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందవచ్చునని భరోసానిస్తోంది. 

సాహిత్య అనే ఆ రెస్టారెంట్ యజమాని మనీష్ దవే మాట్లాడుతూ.. 'నాకు సాధ్యమైనంతవరకు సాధ్యమైనంత మందికి ఆశ్రయంతో పాటు ఆహారం అందిస్తూనే ఉంటాను.' అని పేర్కొన్నారు. ఇప్పటివరకూ దాదాపు 132 మందికి తమ రెస్టారెంట్‌లో ఆశ్రయం ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో చిన్నపిల్లలు, గర్భిణులు, నిరాశ్రయులు, వృద్దులు ఉన్నారు. గుజరాత్‌కి చెందిన మనీష్ 2021లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో.. అక్కడ కూడా మన కల్చర్‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో ఈ అనూహ్య పరిణామాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలుతున్నారని.. ఈ క్రమంలో తమ రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో వీలైనంత మందికి ఆశ్రయం కల్పిస్తున్నామని తెలిపారు. తమ రెస్టారెంట్ బేస్‌మెంట్ స్థలం చాలా పెద్దది అని.. ఈ యుద్ధ సమయంలో నిరాశ్రయులకు తాను సాయం చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ మనీష్ ఒక ప్రకటన చేశారు.

'ఈ యుద్ధ సమయంలో మీరు తలదాచుకునేందుకు సురక్షిత ప్రదేశం లేనట్లయితే.. దయచేసి ఇక్కడికి రండి. మాకు సాధ్యమైనంతవరకు ఉచిత ఆహారం, వసతి అందిస్తాం.' అని అందులో పేర్కొన్నారు. తమ వద్ద ఆశ్రయం పొందుతున్నవారితో కలిసి అంతా ఒక కటుంబంగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. మనీష్ రెస్టారెంట్‌లో ఆశ్రయం పొందుతున్నవారు.. అతను, అతని బృందం అందిస్తున్న సాయానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. 

ప్రస్తుతం భారత్‌లో ఉన్న తన కుటుంబం తన గురించి ఆందోళన చెందుతున్నట్లు మనీష్ తెలిపారు. ఇప్పటికైతే తాను ఉక్రెయిన్‌లోనే ఉండదలుచుకున్నానని.. పరిస్థితులు మరింత దిగజారితే ఆ దేశాన్ని వీడుతానని చెప్పారు. అప్పుడు రెస్టారెంట్ తాళాలను అక్కడ తలదాచుకుంటున్నవారికి అప్పగించి వచ్చేస్తానని చెప్పుకొచ్చారు.

Also Read: Joe Biden confuse: జో బైడెన్​ స్పీచ్​లో తడబాటు.. జోకులు వేస్తున్న నెటిజన్లు!

Also Read: Amazon Oneplus 9RT: రూ.47,000 విలువైన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.24 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News