Bandi Sanjay About Asaduddin Owaisi: నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

Bandi Sanjay About Asaduddin Owaisi: ఇన్నాళ్లు లవ్ జిహాద్ అనుకున్నం... ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తోంది. హిందూ యువకులను బెదిరించి, మాయమాటలు చెప్పి ముస్లింలుగా మార్చి టెర్రరిస్టులుగా మార్చి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా ఉగ్రవాదులేననే ముద్ర వేయాలనే కుట్ర జరుగుతోంది అని బండి సంజయ్ మండిపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 10:53 AM IST
Bandi Sanjay About Asaduddin Owaisi: నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

Bandi Sanjay About Asaduddin Owaisi: హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2‌016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను గుర్తుంచుకోవాలన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. 

ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, సీహెచ్.విఠల్, పోరెడ్డి కిశోర్ రెడ్డి, రిటైర్ట్ ఐపీఎస్ అధికారి క్రిష్ణ ప్రసాద్ లతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. 

బండి సంజయ్ ప్రెస్ మీట్‌లోని ముఖ్యాంశాలు...
హైదరాబాద్ లో హిజ్జు ఉత్ తహరీర్ (HUT) సంస్థ ఉగ్రవాదులు దొరికారు. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరంగా మారింది. రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్న సంస్థ. ఒంటరిగానే ఎవరిపైనైనా దాడులు చేసి కలకలం సృష్టిస్తున్న సంస్థ ఇది. ఇట్లాంటి ప్రమాదకరమైన సంస్థకు హైదరాబాద్ షెల్టర్ జోన్ గా మారడం ఆందోళన కలిగిస్తోంది. మేం అనేక సందర్భాల్లో పాతబస్తీలో రోహింగ్యాలకు షెల్టర్ జోన్ గా మారిందని చెబుతూనే ఉన్నాం. ఇవాళ అదే నిజమైంది. పట్టుబడ్డ హెచ్ యూటీ ఉగ్రవాది మహ్మద్ సలీం డెక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్ ఓడీగా పనిచేస్తున్నాడు. ఈ కాలేజీ అధినేత ఒవైసీనే. మజ్లిస్ కు ఉగ్రవాదులతో సంబంధం ఉందనడానికి ఇంతకంటే ఆధారాలేం కావాలి అని బండి సంజయ్ ప్రశ్నించారు.

2016 జులైలో ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సమయంలో ఒవైసీ మాట్లాడుతూ వాళ్లకు బెయిల్ ఇప్పిస్తా... వాళ్ళ తరపున న్యాయపోరాటం చేస్తానని అధికారికంగా ప్రకటించారు. అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇదిగో ఆ పత్రిక క్లిప్పింగ్... ఆరోజు బెయిల్ ఇప్పిస్తానన్న వ్యక్తే ఇయాళ తన మెడికల్ కాలేజీలో ఉద్యోగమిచ్చి పెంచి పోషిస్తున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నేను రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటే చాలామంది మొరిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఓట్లు పొందడానికి జిమ్మిక్కు చేస్తున్నారే తప్ప అలాంటిదేమీ లేదని ట్విట్టర్ టిల్లు, ఒవైసీ సోదరులు ఆనాడు మాట్లాడారు. ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తాన్న ఒవైసీ ఎట్లాంటి వాడో ఆలోచించాలి. 

గతంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మను 52 సార్లు పొడిచిన ఉగ్రవాదికి హైదరాబాద్ లో షెల్టర్ ఇచ్చారు. పీఎఫ్ఐకి షెల్టర్ జోన్ ఎంఐఎం పార్టీ. రాజకీయాల కోసం ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటే... ఓ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంకు మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలోనూ ఇదే విధంగా జరిగింది. ఈ రెండు పార్టీలకు హైదరాబాద్ ప్రజల భద్రత ముఖ్యం కాదు.. మైనారిటీ ఓట్ల ద్వారా అధికారం పొందాలనుకుంటున్నారే తప్ప శాంతిభద్రతలపట్ల, ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో చిత్తశుద్ధి లేదు. 

ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు వీసా గడువు ముగిసినా హైదరాబాద్ లోనే మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానం ఉంది. నాడు డిప్యూటీ సీఎంగా, నేడు హోంమంత్రి గా ఉన్న వ్యక్తే రోహింగ్యాల కార్యక్రమాలకు వెళ్లారు. వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ ప్రజలు బాంబుల కింద ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భాగ్యనగర్ ప్రజల ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నయి. హెచ్ యూటీ ఉగ్రవాదులు అనంతగిరి కొండలను శిక్షణా కేంద్రంగా చేసుకున్నరు. డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నరు. ఇన్నాళ్లు ప్రభుత్వం ఏం చేస్తోంది. హీరోలుగా ఉన్న పోలీసులు... కేసీఆర్ పాలనలో జీరోలుగా మారే పరిస్థితి ఏర్పడింది. 

ఇన్నాళ్లు లవ్ జిహాద్ అనుకున్నం... ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తోంది. హిందూ యువకులను బెదిరించి, మాయమాటలు చెప్పి ముస్లింలుగా మార్చి టెర్రరిస్టులుగా మార్చి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా ఉగ్రవాదులేననే ముద్ర వేయాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ సహకారంతో టెర్రిరిస్టు సంస్థలు చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న పీఎఫ్ఐపై నిషేధాన్ని ఎత్తేస్తామని కర్నాటకలో కాంగ్రెస్ ప్రకటించింది. అదే సమయంలో హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న భజరంగదళ్ ను నిషేధిస్తామని చెప్పిందంటే... ఆ పార్టీలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవాలి.

తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. పాకిస్తాన్ తరువాత ఉగ్రవాదుల అడ్డా హైదరాబాద్ గా మారింది. కేసీఆర్ కళ్లుమూసుకుని పాలన కొనసాగిస్తున్నాడు. ఏ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వంపై నమ్మకం పోయింది. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలని బీజేపీ విజ్ఝప్తి చేస్తోంది అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఉగ్రవాద కార్యకలాపాలపై సమీక్ష చేయాలి. ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తోందెవరు? వారి వెనుకున్న వాళ్లెవరో తేల్చాలి. సీఎంకు చీఫ్ అడ్వయిజర్ సోమేశ్ కుమార్ ఓ తిమింగలం. అవినీతి అధికారి. హైకోర్టు మెట్టికాయలు వేసి తీసేస్తే కేసీఆర్ తెచ్చుకుని పెట్టుకున్నడు. ఇగ ఆయన రాజ్యాంగేతర శక్తిగా మారబోతున్నాడు. 9 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలకు ఆద్యుడు ఆయనే. అన్ని అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్య సలహాదారుడిగా నియమించడం సిగ్గు చేటు.

కేసీఆర్ పాలనలో దాదాపు 500 మందికిపైగా రిటైర్డ్ అయిన వాళ్లను సలహాదారులుగా నియమించి వెయ్యి  కోట్ల ప్రజల సొమ్మును పంచి పెడుతున్నడు. ఇక్కడి ఉద్యోగాలను తీసుకుపోయి మహారాష్ట్రకు అప్పగిస్తున్నడు. ఇక్కడి పైసలు తీసుకెళ్లి పంజాబ్ రైతులకు ఇస్తున్నడు. కేసీఆర్ కు కొత్త మానసిక వ్యాధి వచ్చింది. నేనే రాజును. నా కుటుంబమే తరతరాలుగా పాలించాలని అనుకుంటున్నడు. 22వ పులికేశి మాదిరిగా వ్యవహరిస్తున్నడు. కర్నాటకలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని నమ్మకం మాకుంది అని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. 

జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మెకు మేం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వాళ్లది న్యాయబద్దమైన డిమాండ్. ప్రభుత్వం బెదిరించినా అదరకుండా ఉద్యమం చేస్తున్న వాళ్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. మీకు ఏ ఆపదొచ్చినా బీజేపీ అండగా ఉంటుంది.  జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా కష్టపడి పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకున్నోళ్లు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయినా ఎందుకు రెగ్యులరైజ్ చేయరు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుంటే సీఎంకు ఇక విలువ ఏముంటుంది? ఫేక్, పేకుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ మారిండు. జేపీఎస్ ల తోపాటు ఓపీఎస్ లను కూడా రెగ్యులరైజ్ చేయాలి. వీళ్లంతా గొడ్డు చాకిరి చేయడంవల్లే గ్రామ పంచాయతీలకు అవార్డులొచ్చినయ్. కనీసం వాళ్లు సమ్మె చేస్తుంటే పోలీసులు బెదిరిస్తున్నరు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ టెంట్ వేయనీయకుండా అరెస్ట్ చేస్తాం... ఉద్యోగాల నుండి బెదిరిస్తామని చెబుతున్నడు.. సీపీ సంగతి చూస్తాం..

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చేసిన పోరాటం మర్చిపోవద్దు. వాళ్లు ఉద్యమించకపోతే సకల జనుల సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చేదా ? అట్లాంటి వాళ్లను అరిగోస పెడుతున్నారు. సమ్మె చేస్తే బెదిరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని బెదిరింపులు, హెచ్చరికలు ఇప్పుడు చేస్తున్నారంటే పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవాలి. ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుపై అవినీతి లేదు... సీబీఐ విచారణకు సిద్ధమన్న సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై.... దమ్ముంటే సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : Palair MLA Ticket: ఎమ్మెల్యేను తెగ టెన్షన్ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ టికెట్

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ దగ్గర అభివృద్ధి ప్రణాళిక లేదు. మరో 5 లక్షల కోట్ల అప్పు చేస్తడు. కేంద్రాన్ని తిట్టడం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజలు అనుకుంటున్నరు. బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అందులో భాగంగా నిరుద్యోగుల పక్షాన రేపు నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డిలో నిర్వహించబోతున్నం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి తొలగించాలని, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదు. ఫెయిలయ్యామనే భావనతో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దు. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు.. ఈసారి ఫెయిలైతే వచ్చేసారి ఎందుకు పాస్ కాకూడదనే పట్టుదలతో ముందుకుపోవాలే తప్ప చావు పరిష్కారం కాదు అని బండి సంజయ్ విద్యార్థిని, విద్యార్థులకు ధైర్యం చెప్పారు.

ఇది కూడా చదవండి : Talasani Srinivas Yadav: రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంపై స్పందించిన మంత్రి తలసాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News