అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1.20 లక్షల స్మార్ట్ మీటర్లు అందించాలనే వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శనివారం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ విజయవాడ వచ్చిన క్రమంలో విద్యుత్ సంస్కరణల మీద జరిగిన చర్చలో భాగంగా రాష్ట్రానికి స్మార్ట్ మీటర్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే మరో 30 వేల సోలార్ ల్యాంప్స్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో స్థాపించబోయే పెట్రోలియం యూనివర్సిటికి సంబంధించి నిధులు విడుదల చేయాలని కూడా కోరగా, దానికి కూడా మంత్రి సానుకూలంగానే స్పందించినట్లు వినికిడి. ఏపీలో ఇంధన రంగానికి సంబంధించి తీసుకొస్తున్న సంస్కరణలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి తెలియజేయగా, ఆయన ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రంలో త్వరలోనే వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కును కూడా నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు.