Raghu Ramakrishnam Raju: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘు రామకృష్ణంరాజు వ్యవహారం కొలిక్కి వచ్చేట్టు కన్పిస్తోంది. అనర్హత వేటు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడీ అంశం ప్రివిలేజ్ కమిటీ బరిలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్శాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన రఘు రామకృష్ణంరాజు గెలిచిన ఏడాది తరువాతే అసంతృప్తి వెళ్లగక్కడం ప్రారంభించారు. క్రమక్రమంగా ఇతర పార్టీ నేతలతో కలిసి సొంతపార్టీకు వ్యతిరేకంగా, పార్టీ అధినేతకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. అంతేకాకుండా పార్టీ క్రమశిక్షణా రాహిత్య చర్యలకు పాల్పడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. దీంతో పార్టీ గుర్తుపై గెలిచి..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి, మార్గాని భరత్‌లు ఆధారాలు కూడా సమర్పించారు. 


లోక్‌సభ స్పీకర్ ఈ విషయంపై ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. దాంతో రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు మరోసారి చెలరేగిపోయారు. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని సవాలు విసిరారు. ఫిబ్రవరి 5 లోగా అనర్హత వేయించగలరా అంటూ సవాల్ చేశారు. ఆ తరువాత తానే రాజీనామా చేసి నర్శాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పరిస్థితి ఉంది. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనలేదని..లోపాల్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని రఘు రామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై తాజాగా రాజమండ్రి ఎంపీ , పార్టీ విప్ మార్గాని భరత్ కూడా రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..ఆధారాలు సమర్పించారు. దీనిపై లోక్‌సభ స్పీకర్(Loksabha Speaker)ఓం బిర్లా స్పందించారు. ఈ పిటీషన్‌ను ప్రివిలేజ్ కమిటీకు (Privilege Committee) పంపించారు. ప్రివిలేజ్ కమిటీకు పంపడమనేది ఈ వ్యవహారంలో కీలకమైన చర్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు రఘు రామకృష్ణంరాజు విధించిన డెడ్‌లైన్ కూడా ఫిబ్రవరి 5వ తేదీగా ఉంది. ఈ క్రమంలో రఘు రామకృష్ణంరాజుపై చర్యలు ఖాయమనే సంకేతాలు విన్పిస్తున్నాయి. అనర్హత విధిస్తే సొంతంగా అమరావతి ఎజెండాపై పోటీ చేసేందుకు రఘు రామకృష్ణంరాజు(Raghu Ramakrishnam Raju) సిద్ధంగా ఉన్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా..ఆయనకు మద్దతుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు నిలిచే అవకాశాలున్నాయి. మరి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr Congress Party) ఎలాంటి ప్రతివ్యూహం సిద్ధం చేసుకుంటుందో చూడాలి. 


Also read: TTD Darshanam Tickets: శ్రీవారి దర్శనం టోకెన్లు త్వరలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook