అమరావతి: కోస్తాంధ్రాను పెథాయ్ తుపాన్ అతలాకుతలం చేసింది. తుపాన్ తీవ్రతకు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగిసిపడ్డాయి. ఊహించినట్టుగానే ఇవాళ సాయంత్రం కాకినాడ తీరం వద్ద తుఫాన్ తీరం దాటింది. తుపాన్ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో జనం ఇబ్బందులకు గురికాకుండా అమరావతిలోని ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని, అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే ఎప్పటికప్పుడు రాష్ట్రంలో తుపాన్ పరిస్థితిని సమీక్షిస్తూ, వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడి నుంచే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.