అమరావతి: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య వెనుక టీడీపి హస్తం ఉందని వస్తోన్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మరోసారి స్పందించారు. వైఎస్ వివేకాను చంపడం వల్ల ఎవరికీ లాభం చేకూరుతుందనే వాస్తవాలన్నీ త్వరలోనే వాటంతల అవే బయటికొస్తాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేసి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్సార్సీపీ భావిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వాళ్ల సొంత ఊర్లో, వాళ్ల ఇంట్లో జరిగిందని.. అటువంటప్పుడు ఆ హత్యను టీడీపీపై నెట్టేయాలనుకోవడం అమానుషమే అవుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికే కోడికత్తి కేసు తెచ్చారని, షర్మిలతో పాత కేసులు పెట్టించారని చంద్రబాబు మండిపడ్డారు. 


శనివారం ఉదయం తెలుగు తమ్ముళ్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా నేడు తిరుపతి నుంచే విజయ శంఖారావం పూరించనున్నట్లు తెలిపారు. దైవ దర్శనం అనంతరం శ్రీకాకుళం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.