తీవ్ర అస్వస్థతతో విషమ పరిస్థితుల మధ్య ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయిని పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు వాజ్‌పేయి ఆస్పత్రిపాలైనప్పుడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ రివ్యూ మీటింగ్‌కి హాజరైన చంద్రబాబు నాయుడు సమావేశం అనంతరం ఎయిమ్స్ కి వెళ్లి వాజ్ పేయిని పరామర్శించి వచ్చారు. తాజాగా వాజ్ పేయి ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉందన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నట్టు సమాచారం.


ఇదిలావుంటే, మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు బీజేపీ అగ్రనేతలు, రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్‌కి క్యూ కట్టారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నేతలు ఒక్కొక్కరిగా ఎయిమ్స్‌కి వెళ్లి వస్తున్నారు.