అమరావతి: కరోనావైరస్ పాజిటివ్ కేసులు (Coronavirus positive cases), దేశంలో మృతుల సంఖ్య (Death toll) పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) రాష్ట్ర ప్రజలందరికీ ఓ విజ్ఞప్తిచేశారు. ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రజలను కోరిన సీఎం జగన్.. అలా చేసినప్పుడే కరోనా వైరస్‌ను నిరోధించగలమని అన్నారు. కరోనావైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే క్రమశిక్షణతోనే అది సాధ్యమవుతుందన్నారు. అలా కాకుండా ప్రభుత్వం సూచనలను నిర్లక్ష్యం చేస్తే.. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బుధవారం రాత్రి ఏపీలోని తమ స్వస్థలాలకు రావాలని ప్రయత్నించిన చాలా మందిని తెలంగాణ -ఏపీ సరిహద్దుల్లోనే (AP-TS border) నిలిపేయాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం బయటున్న ఏపీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దేశంలో ఎక్కడ చిక్కుకున్నవారైనా సరే కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే చాలు... వారికి కావాల్సిన సదుపాయాలను కేంద్రమే చూసుకుంటుందని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో నెలకొన్న పరిస్థితి గురించి సీఎం జగన్ వివరిస్తూ.. ఇప్పటివరకు ఏపీలో కేవలం 10 కరోనావైరస్ పాజిటివ్ కేసులే నమోదయ్యాయని.. కేసులు ఇంకా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. అలాగే విదేశాల నుంచి వచ్చినవారిపై సైతం స్థానిక అధికారుల సహాయంతో నిఘా ఉంచామని వెల్లడించారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. కరోనాపై ప్రభుత్వం చేస్తోన్న పోరాటానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. 


కేంద్రం లాక్ డౌన్ (Lockdown) విధించినట్టుగా ఏప్రిల్‌ 14 వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉండగలిగితే.. కరోనావైరస్ కాంటాక్ట్ కేసులను గుర్తించడానికి వీలుంటుంది. లాక్‌డౌన్‌ని పట్టించుకోకుండా తిరగడం మొదలుపెడితే కాంటాక్ట్ కేసులను గుర్తించడం కష్టం అవుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీకి వచ్చినవారందరినీ క్వారంటైన్‌కు (Quarantine) తరలించకతప్పదని.. అక్కడ అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే వారిని తమ తమ స్వస్థలాలకు పంపించడం జరుగుతుందని స్పష్టంచేశారు.