న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( Nimmagadda Ramesh Kumar ) తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High court ) ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏపీ సర్కార్‌కి ఇదో పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) స్పందిస్తూ..  వైసీపీ సర్కార్‌కి ( AP govt ) ఇది ఓ కనువిప్పు కావాలని  అన్నారు. అయితే అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కూడా ఇకపై నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలను వాయిదా వేసే వరకు అధికారపక్షానికి, వాయిదా వేసిన తర్వాత ఆయన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కనిపించిందని చెబుతూ.. రాజ్యాంగ విలువలను కాపాడేలా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు పనిచేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలతో పని చేయాలని జీవిఎల్ నరసింహా రావు అభిప్రాయపడ్డారు. ( AP High Court : ఏపీ సర్కార్‌కి షాక్ ఇచ్చిన హై కోర్టు )


ఏపీ హై కోర్టు ఇచ్చిన సంచలన తీర్పును వైసీపీ ప్రభుత్వానికి ఓ ఎదురు దెబ్బగా అభివర్ణించిన జీవీఎల్.. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి దెబ్బలు తప్పవనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఇకనైనా తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాల అధికారాలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలని గుర్తుచేశారు. హై కోర్టు తీర్పు అనంతరం జీవిఎల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..