ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం సవరణకు కేంద్రం దాదాపుగా అంగీకరించింది. దీనికి సంబంధించిన దస్త్రానికి మూడు రోజుల క్రితం న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను న్యాయశాఖ ఆమోదించింది. అధికారులు, నిపుణులతో సంప్రదించిన తర్వాత కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. దస్త్రాన్ని న్యాయశాఖ నుంచి హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. సోమవారం తరువాత పిఎంఒ నుంచి రాష్ట్రపతి ఆమోదానికి ఈ దస్త్రం వెళ్లనున్నది. ఈ వారంలో దాదాపు ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


2013 కొత్త భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ 2017 నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకువచ్చింది. శాసనసభలో దీనిని ఆమోదించాక కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే తొలుత ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు పలు అనుమానాలు లేవనెత్తగా.. రాష్ట్ర  ప్రభుత్వాధికారులు వాటిని నివృత్తి చేశారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన తరువాత న్యాయ, హోంశాఖ అధికారుల ఆమోదం తెలిపాయి.