విజయవాడ: తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధాలు బాగున్నాయని ఏపీ సర్కార్ చెబుతుండటాన్ని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు మళ్లిస్తేనే ఓర్వలేని పరిస్థితిలో ఉన్న తెలంగాణతో ఏపీకి మంచి సంబంధాలున్నాయంటే ఎలా నమ్మాలి అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు.. కృష్ణా నది వరదలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగున్నట్టయితే.. పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలపై కృష్ణా వాటర్ బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగున్నాయని చెప్పుకుంటున్న ఏపీ సర్కార్.. ఇకనైనా తెలంగాణ ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.