CM Jagan Review Meeting: ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి‌ సమీక్ష నిర్వహించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలన సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని స్పష్టంచేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి.. వారిలో భరోసాను నింపాలన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్‌గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని కూడా సీఎం చెప్పారు. ఇదే సమయంలో సంబంధిత అధికారులకు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. అంతేకాక సకాలంలోనే వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్నిరకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని కూడా సీఎం వివరించారు. అలాగే పంటనష్టపోయినవారికి వైయస్సార్‌ ఉచిత బీమాకింద వారికి పరిహారం అందించడానికి అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి నష్టపోయిన ప్రతిరైతునూ ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 


రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభించారా అని అధికారులను ఆరా తీసిన సీఎం, ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్‌ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత 23 నుంచి 25 వరకు సవరణలు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం 26న జిల్లా కలెక్టర్లు తుది జాబితాలు ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సంక్రాంతి లోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం అధికారులకు సూచించారు.