తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాపికొండల్లో ఈ రోజు ప్రయాణికులు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం జరిగినప్పుడు బోటులో 120 మంది ప్రయాణిస్తున్నారు. పోశమ్మ గుడి నుండి బోటు బయలుదేరిన కొద్దిసేపటికే.. అందులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే బోటు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఒడ్డుకి దాన్ని తరలించడంతో ప్రయాణికులు బయటకు దూకి తమ ప్రాణాలు దక్కించుకున్నారు. బోటు మాత్రం అగ్నికి ఆహుతైపోయింది. పూర్తిగా సినీ ఫక్కీలో సాగిన ఈ సంఘటనలో బోటులోని యువకులు ప్రయాణికులను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే మంటలు చెలరేగడానికి కారణం బోటులో గ్యాస్ పొయ్యి ఉండడమే అని చెబుతున్నారు టూరిస్టులు. 


బోటులో అగ్ని ప్రమాదం జరిగిందన్న సమాచారం అందగానే... సంఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. స్థానికులు కూడా ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం ఆఫీసుకు కూడా సమాచారం అందింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టరుతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని ఆదేశించారు.