Fireworks Factory Explosion in AP: అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తంచేసిన సీఎం వైఎస్ జగన్... మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేలుడు సంభవించిన బాణాసంచా ఫ్యాక్టరీ వద్ద సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడంతో పరిశ్రమ పరిసరాలు నిప్పుల కొలిమి తలపిస్తున్నాయి. పరిశ్రమలో బాణాసంచా పేలుడు శబ్ధం విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ.. ఫ్యాక్టరీలో మరింత బాణాసంచా నిల్వ ఉందనే అనుమానంతో, ఏ క్షణమైనా అవి పేలే ప్రమాదం ఉందన్న భయాందోళనలతో స్థానికులు పరిశ్రమ వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. 


స్థానికులు అందించిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తాడేప్లలిగూడెం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ పేలుడు ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.