చిత్తూరు: తిరుమల శ్రీవారిని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు రాజపక్సే దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆయనకు అందించారు. రాజపక్స శ్రీలంక నుండి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంకి చేరుకొని, అక్కడి నుండి తిరుమలకి చేరుకున్నారు.