ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. సమాజాన్ని కులం, మతం ప్రాతిపదికన విభజించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఒక జాతీయ దృక్పథం ఉన్న పార్టీలు ఎందుకు ఉండవు? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మన దేశంలో జాతీయ దృక్పథం కలిగిన పార్టీలు లేకపోవడం వ్యవస్థకు తీరని లోటు అని పేర్కొంటూ బీజేపీ హిందూ పార్టీగా మారిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పార్టీని హిందూ మతం పార్టీగా ముద్రవేసి విమర్శించడం గమనార్హం.