వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు 2019 సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అని రాజకీయ విశ్లేషకులు, అటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ పార్టీ ఇన్‌చార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలిపారు.


మంగవారం అవనిగడ్డలో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జనసేన కార్యకర్తలతో కృష్ణారావు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పైవిషయాన్ని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పవన్ తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారంలో ఉంది. అయితే, పవన్ పోటీ చేసే స్థానంపై జనసేన నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పవన్ కూడా ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు.