ఐటీ గ్రిడ్స్‌ పై కేసు నమోదు అంశంపై చంద్రబాబు ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు.  ఈ ఉదయం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐటీ గ్రిడ్స్‌పై కేసులో నమెదు చేస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్ధకావడం లేదన్నారు. తప్పు చేయనపుడు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమ ప్రాంత పరిధిలో ఉన్న ఓ సంస్థ నిర్వాకాలపై ఫిర్యాదు వస్తే స్పందించడం, కేసు పెట్టి విచారించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారన్న ఫిర్యాదు నిజమేనని తెలుస్తోందని.. దీనిపై పూర్తి వివరాలు విచారణ తరువాతే వెలుగులోకి వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు


ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితా, ఆధార్‌, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు టీడీపీకి సాంతకేత సేవలు అందిస్తున్న ఐటీ సంస్థ ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ వద్ద అక్రమంగా ఉన్నాయంటూ ఓ డేటా అనలిస్ట్‌ తుమ్మ లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు. ఈ  ఫిర్యాదుపై స్వీకరించిన సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఇప్పటికే పోలీసులు అక్కడ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు సహకరించే సమాచారం కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో నలుగురు ఉద్యోగులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసుపై స్పందిస్తూ ఇది కేసీఆర్ ప్రభుత్వం కుట్ర అంటూ ఆరోపణలు చేశారు.దీనిపై స్పందించిన టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ మేరకు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.