తిరుమల: తిరుమలలో కిడ్నాప్‌కి గురైన బాలుడు వీరేష్ ఆచూకీ లభించింది. తిరుమలలో బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మామునూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బాలుడిని తీసుకెళ్తున్న కిడ్నాపర్ పట్టుబడ్డాడు. గత 48 గంటలుగా ఈ కిడ్నాప్ ఉదంతానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. కిడ్నాపర్‌ని, కిడ్నాపర్ చేతుల్లో వున్న బాలుడిని గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు.. వెంటనే వాట్సాప్ ద్వారా వారి ఫోటోలను తిరుమల పోలీసులకు పంపించారు. ఆ ఫోటోల్లో వున్నది కిడ్నాపరే అని తిరుమల పోలీసులు ధృవీకరించడంతో వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 


మహారాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం మేరకు బాలుడిని తీసుకొచ్చేందుకు తిరుమల పోలీసులు అక్కడికి బయల్దేరారు. రేపు సోమవారం తిరుమల పోలీసులు బాలుడిని అతడి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం వుంది. బాలుడి ఆచూకీ లభించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవదులులేకుండా పోయాయి.