Minister Roja Interesting Comments on Her Life: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం తిరుపతిలో పర్యటించిన మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆనాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుపై గతంలో దివంగత నేత ఎన్టీఆర్ చెప్పిన వాస్తవాలే అందుకు నిదర్శనం అని అన్నారు. అందుకే చంద్రబాబు గాడ్సే కన్నా ఘోరమైన వ్యక్తి అని విరుచుకుపడ్డారు. ఏపీలో వైసీపీని ఢీకొట్టడం పవన్ కళ్యాణ్ వల్ల కావడం లేదని భావించిన చంద్రబాబు నాయుడు.. తమిళనాడు నుంచి రజనీకాంత్‌ను పిలిపించుకుని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడిపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఎన్ని రకాలుగా అవాకులు చెవాకులు పేలుతూ మాట్లాడారో మనందరం చూశాం. అలాంటి చంద్రబాబు నాయుడు మళ్లీ ఇప్పుడు ప్రధాని మోదీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారని అన్నారు. అమ్మను చూసుకోని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తన అవసరం కోసం అదే ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నాడని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారని.. చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో దూరం పెట్టినా ఇంకా ఆయనకి బుద్ది రావడం లేదని మంత్రి రోజా అసహనం వ్యక్తంచేశారు.


గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే.. వెంకన్న భక్తులకు మంత్రి రోజా విజ్ఞప్తి
మంత్రి రోజా అంతకంటే ముందుగా తిరుపతి గంగమ్మ గుడిని సందర్శించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. గంగమ్మ గుడిని ఒక్క సీఎం వైఎస్ జగన్ తప్పించి ఏ ముఖ్య మంత్రి కూడా దర్శించుకోలేదు అన్నారు. వెంక్కన్న చెల్లిగా ఉన్న గంగమ్మ తల్లికి టీటీడీ తరపున సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఇక మీద తిరుమలకి వెళ్లే భక్తులు మొదటగా వెంకన్న చెల్లి అయిన గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే తిరుమలకి వెళ్ళాలి అని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాకా జరుగుతున్న మొదటి జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై ప్రతీ సంవత్సరం ఇక్కడ గంగమ్మ జాతరను రాష్ట్ర పండగ జరుపుకుంటాం అని మంత్రి రోజా ప్రకటించారు.


తిరుపతి పర్యటనలో భాగంగానే స్థానిక తారక రామ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం కప్ స్టేట్ లెవల్ టోర్నమెంట్ మంత్రి రోజా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 4,700 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నట్టు మంత్రి రోజా తెలిపారు. 14 విభాగాల్లో రాష్ట్రస్థాయిలో పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి ఏపి సీఎం కప్ ఫైనల్ పోటీలు తిరుపతిలో జరగడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఏపి సీఎం కప్‌కు ఎంపిక అవుతారు. 


ఎన్నో కష్టాలు పడ్డాను.. ఎన్నో ఇబ్బందులు పడ్డాను..
కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా క్రీడాకారులు ఎక్కడా నిరుత్సాహ పడకుండా ప్రతీ ఒక్కరూ లక్ష్యం దిశగా ముందుకు సాగి గమ్యాన్ని చేరుకోవాలి అని అన్నారు. అందుకు తన జీవితమే ఆదర్శం అని అన్నారు. చాలా కష్ట పడ్డాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అడవిని ఆనుకొని ఉన్న బాక్రాపేటలో పుట్టిన తాను ఈ రోజు ఇలా మంత్రిగా మీ ముందు నిల్చున్నాను అని చెప్పి అందరిలో స్పూర్తిని రగిల్చారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజం. ప్రతి ఒక్కటి స్పోర్టివ్‌గా ముందుకు సాగిపోవాలి అన్నారు. ఈ పోటీల్లో గెలిచిన వారిని జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చి దిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అని మంత్రి రోజా భరోసా ఇచ్చారు.