ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు. గవర్నర్ నరసింహన్ తెలంగాణపై ప్రేమ చూపుతున్నారని... ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ధోరణిలో మాట్లాడారు. 


ఆంధ్ర ప్రదేశ్‌లో వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టసవరణ బిల్లును నెలరోజులుగా గవర్నర్ ఆమోదించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారని మండిపడ్డారు. అదే తరహా బిల్లును తెలంగాణ శాసనసభలో ఆమోదించి రాజ్ భవన్‌కు ఆమోదానికి పంపిస్తే.. గవర్నర్ ఆ బిల్లును మూడు రోజుల్లో ఆమోదించారని ఆరోపించారు. గవర్నర్ నరసింహన్ హైదరాబాద్లో ఉండటంతో.. తెలంగాణ రాష్ట్రం పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారని.. ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.