AP CAPITAL : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం కానుందా? తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో పొత్తుల అంశం హాట్ హాట్ గా మారింది. 2014 తరహాలోనే టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉండబోతుందనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మాట్లాడటంతో టీడీపీ, బీజేపీ పొత్తుకు అడుగులు పడ్డాయనే ప్రచారం జరిగింది. దీనిపై జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. అయితే వైసీపీ వర్గాలు మాత్రం టీడీపీ ఉన్నది లేనట్లుగా ప్రచారం చేసుకుంటోందని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ విషయంలో బీజేపీ స్టాండ్ మారిందనే సంకేతం వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రోజులుగా జగన్ సర్కార్ కు వరుస షాకులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు రాజధానుల విషయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకైక రాజధానే తమ విధామని స్పష్టం చేస్తూ జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది. విభజన సమస్యలపై ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమాచాంర ఇచ్చింది. సమావేశం ఎజెండా కూడా ఇచ్చిది కేంద్రం.  విభజన చట్టం షెడ్యూల్ 9 10లోని ఆస్తుల పంపకాలపైనా చర్చించనున్నట్లు  తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక అంశాలను కేంద్రం చర్చించనుంది. అయితే కేంద్ర హోంశాఖ ఎజెండాలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. కొత్త రాజధానికి నిధులు అని చేర్చింది. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులు, విద్యాసంస్థల ఏర్పాటు, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానం వంటి అంశాలను ఎజెండాలో చేర్చింది.


కేంద్ర సర్కార్ తాజా ఎజెండాలో కొత్త రాజధానికి నిధులు అని చేర్చడం ద్వారా ఏకైక రాజధానికే మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నది స్పష్టమైంది. మూడు రాజధానుల బిల్లును వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ జగన్ సర్కార్ ప్రవేశపెట్ట నుందనే  ప్రచారం సాగుతుండగా కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీకి షాకింగ్ మారింది. ఇటీవలే పలు సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు సీఎం జగన్. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు జగన్. మూడు రాజధానుల గురించే కేంద్రం పెద్దలతో జగన్ మాట్లాడారనే ప్రచారం జరిగింది. అయితే  తాజా పరిణామాలతో  రాజధాని విషయంలో జగన్ కు మోడీ సర్కార్ షాక్ ఇచ్చారని భావిస్తున్నారు. అదే సమయంలో అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్న టీడీపీతో ఏకభవించినందున.. ఆ పార్టీతో పొత్తు దిశగా బీజేపీ పెద్దలు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన మద్దతు ఇచ్చింది. 2014లో ఏపీలో టీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబు కేబినెట్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. అటు మోడీ కేబినెట్ లోనూ టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. అయితే 2018లో బీజేపీతో విభేదించారు చంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని, ప్రత్యేక  హోదా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీకి బైబై చెప్పారు చంద్రబాబు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరంటూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి పలు రాష్ట్రాల్లో సభలు నిర్వహించారు. ప్రధాని మోడీపై వ్యక్తిగతంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు. తిరుపతికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం సంచలమైంది. దీంతో కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబును బీజేపీ పూర్తిస్థాయిలో టార్గెట్ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం ఏపీలో వైసీపీకి బీజేపీ సహకరించిందనే టాక్ ఉంది. జగన్ కు నిధులు సమకూర్చడంతో పాటు చంద్రబాబు ఆర్థికమూలాలను దెబ్బతీసిందని అంటారు.


2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ విషయంలో చంద్రబాబు రూట్ మార్చారు. గత మూడున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కేంద్రంలో మళ్లీ మోడీనే అధికారంలోకి వస్తారని అంచనా వేసిన చంద్రబాబు.. బీజేపీతో తిరిగి పొత్తు కోసం తాపత్రయపడుతున్నారు. సమయం దొరికితే చాలు బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక్కడే చంద్రబాబు మరో వ్యూహం ఉందంటున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. టీడీపీతో పొత్తుకు జనసేన సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే బీజేపీ మాత్రం పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీతో పొత్తు కుదిరితే జనసేన కూడా కూటమిలో ఉంటుంది. అదే జరిగితే వైసీపీని ఓడించడం సులభమని చంద్రబాబు లెక్కలేస్తున్నారని అంటున్నారు. అందుకే బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. త్యాగాలకు కూడా సిద్దమయ్యారు. రాజధాని విషయంలో కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో టీడీపీ, బీజేపీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ పడిందనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది.


Read also: Telangana Elections: అసెంబ్లీ రద్దు ఎప్పుడు? కేసీఆర్ ప్లాన్ మారిందా?


Read also: సరికొత్తగా ప్రమోషన్స్‌.. రాజకీయాల మాదిరి పాదయాత్ర మొదలెట్టిన హీరో నాగశౌర్య! ఇదే మొదటిసారి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook