ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని కేంద్ర ప్రభుత్వ అవార్డు వరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధనం ఆదా చేస్తున్న ఉత్తమ సంస్థగా హెరిటేజ్ ఫుడ్స్ ఎంపిక కావడంతో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ హోదాలో బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ఈ అవార్డును  కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా అందుకోవడం గమనార్హం.


ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఇంధన ఆదా సదస్సు - 2017లో దేశవ్యాప్తంగా ఇంధనం ఆదా చేస్తున్న పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం తమ ఎలక్ట్రికల్ సేవింగ్స్‌ను 14.5% తగ్గించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఈ అవార్డును పొందడం గమనార్హం. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.