తమిళనాడులో తమ పార్టీని పరిచయం చేసేందుకు బుధవారం చెన్నైకి వెళ్లిన ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉన్న సమస్యల గురించి ఏకరువు పెట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాల పట్ల, వారి సంస్కృతి సంప్రదాయాల పట్ల అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన పవన్.. తాజాగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన సమాచారం ప్రకారం.. అవసరమైతే భవిష్యత్‌లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌తో సైతం కలిసి పనిచేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 


అయితే, బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూసే జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తానని పవన్ ప్రకటించడం చర్చనియాంశమైంది.