పశ్చిమ గోదావరి కొవ్వూరు సభలో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఆవిర్బవించడానికి కారణం.. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించడమేనని ఆయన తెలిపారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ జనసేనను ఏ ఇతర పార్టీలోనూ కలపనని ఆయన అన్నారు. యువత నక్సలిజం లాంటి విపరీత ధోరణుల వైపు వెళ్లడానికి కారణాలు కూడా మనం ఆలోచించాలని... ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అవుతుంది కాబట్టి యువకులు ఆయుధాలు పట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితి మారాలని జనసేన కోరుకుంటుందని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కులాల మధ్య విద్వేషాలు రగిలించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం మానుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచాక.. తనకు చాలా విషయాలు బోధపడ్డాయని పవన్ తెలిపారు. తనకున్న పరిధిలో ప్రపంచ బ్యాంకు అధికారులతో చర్చించిన తర్వాత కొన్ని నిజాలు తెలిశాయని అన్నారు. భారతదేశంలో రాజకీయ నాయకులకు చిన్న చిన్న ప్రాజెక్టుల వల్ల డబ్బులు మిగలవని.. అందుకే పెద్ద ప్రాజెక్టుల కోసం వారు ఆశపడతారని పవన్ అభిప్రాయపడ్డారు. 


అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన విషయంపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో చాలా మంది తమను దోచుకుంది ఆంధ్రవాళ్లు అంటే బాధగా ఉండేదని.. వాళ్లు అలా జనరలైజ్ చేసి మాట్లాడడం తప్పని... ఏపీ, తెలంగాణ అన్న తేడా లేకుండా అవినీతి పరులైన రాజకీయ నాయకులు అందరూ వారిని దోచుకున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు మోదీ, అమిత్ షా వంటి వారి పేర్లకు భయపడే స్థాయికి చేరుకున్నారని... కానీ తాము భయపడమని... తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడడానికే జనసేన పార్టీ పుట్టిందని పవన్ అన్నారు.