బాబాయి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా వున్నానని ప్రకటించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్టు చరణ్‌ ఓ ప్రైవేటు కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "వాస్తవానికి నాన్న గారు ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినప్పుడే ప్రచారం చేయాలని భావించాను. అయితే, అప్పుడు బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ వద్దని చెప్పడంతో ఆగిపోయాను. కానీ ఇప్పుడు అదే బాబాయ్‌ జనం కోసం ఒంటరి పోరాటం చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు. అందుకే బాబాయ్ ఒప్పుకుంటే, తాను జనసేన తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నా" అని రామ్‌ చరణ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


ఇక చెర్రీ సినిమాల విషయానికొస్తే, రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు.