Ration Dealers Strike: రాష్ట్రంలో అన్నార్థులు ఉండొద్దని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ సర్కార్ పేదలకు రేషన్ పంపిణీ చేపడుతోందని, సంవత్సరానికి వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ నాణ్యమైన, పోషక విలువలు ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ కార్డుదారులకు ఇబ్బందులు రానివ్వద్దని మంత్రి గంగుల కమలాకర్ రేషన్ డీలర్లకు సూచించారు. ఈమేరకు రేషన్ డీలర్ల సమస్యలపై నేడు హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
     
ఈ సమీక్ష అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపుగా ప్రతీ నెల 90 లక్షల కార్డులపై 2 కోట్ల 82 లక్షల 60 వేల మందికి 1.80 LMT’s బియ్యం కేటాయించడమే కాకుండా అందుకోసం 298 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని, అలా ఏటా రేషన్ పంపిణి కోసం ప్రభుత్వం 3,580 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్థుతం 17,220కు పైగా రేషన్ షాపులను నిర్వహిస్తున్నామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్.. ఈ రేషన్ డీలర్లు అందరికీ నెలకు 12 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని కమిషన్ రూపంలో అందజేస్తున్నామని అన్నారు.


ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రేషన్ డీలర్లతో చర్చించామని, వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం అవుతామని, పౌరులకు రేషన్ పంపిణి దృష్టిలో పెట్టుకుని రేషన్ డీలర్లు సమ్మే ఆలోచన విరమించుకోవాలని డీలర్లకు సూచించారు.