కాషాయంతో వైసీపీ జతకట్టనుందా? బీజేపీతో పొత్తుకు ఓకే అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు. ఒక జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా మాట్లాడారు. 


ప్రజలకు అసత్యాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చినా ఇంతవరకు రుణాన్ని పూర్తిగా మాఫీ చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న ఒక్క ప్రభుత్వ కట్టడం కూడా పూర్తవలేదని చెప్పారు. కావాలనే టీడీపీ తనపై కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తోందని విమర్శించారు.