సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి అసలు మాట్లాడుకోవటమే అనవసరం అని పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఏబీకే ప్రసాద్. తాజాగా ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏబీకే ప్రసాద్‌ని జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ వైఖరి గురించి స్పందించాల్సిందిగా కోరగా.. అసలు ఆ అంశంపై చర్చే అనవసరమని అన్నారు ఆయన. పవన్ ఎప్పుడు, ఎవరి పక్షాన నిలబడతాడో అనేది ఎవరికీ అర్థం కాని విషయం. సాధారణంగా కొంతమంది తాను లేస్తే మనిషిని కాదని చెబుతుంటారు. కానీ పవన్ కల్యాణ్ విషయంలో ఆయనకి అసలు లేవడమే కష్టమైపోయింది. అటువంటప్పుడు ఆయన గురించి ఇక స్పందించడానికి మాత్రం ఏముంటుంది అని అభిప్రాయపడ్డారు. 


ఇదిలావుంటే, జగన్ పాదయాత్రపై స్పందించిన ఏబీకే ప్రసాద్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు లభించిన స్పందనకన్నా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ స్పందనే కనిపిస్తోంది అని అన్నారు. అధికారంలో ఎవరు వున్నారు అనే సంగతిని పక్కనపెడితే, అంతకన్నా ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే వారి ముందున్న సిసలైన సవాళ్లు అని తన అభిప్రాయాన్ని తెలిపారు.