'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు. ఐతే ఆయన రోడ్డు మార్గం ద్వారానే అమరావతికి వెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఆయన ఇవాళ విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది.  ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి అనుమతి కూడా లభించింది. విశాఖ వెళ్లి గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను ఆయన కలిసేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. కానీ అర్ధరాత్రి విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. దీంతో ఆయన రోడ్డు మార్గంలోనే అమరావతికి బయల్దేరి వెళ్లారు. 


ఐతే ఆయన దారిపొడవునా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి చంద్రబాబు వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చంద్రబాబుకు స్వాగతం పలికారని వైసీపీ విమర్శించింది. ఫోటోలకు ఫోజులిస్తూ చంద్రబాబు బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నారని వైసీపీ ట్వీట్ చేసింది.



మరోవైపు చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపించింది. బాబు విశాఖ  పర్యటనను ప్రకటించగానే విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులను ఒకరోజుపాటు మూసివేశారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అంతే కాదు ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన మేరకే విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులలో ఒకరోజు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారని చెప్పారు.


రెండు నెలల తర్వాత అమరావతి చేరుకున్న చంద్రబాబు ఈ నెల 27 నుంచి జరగబోయే టీడీపీ మహానాడులో పాల్గోనున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..