తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న కేసీఆర్‌కు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రికి కేసీఆర్ కుటుంబం టీటీడీ అతిథి గృహంలోనే బస చేయనుంది. సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. 


అంతకన్నా ముందుగా తిరుమల వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇకపై ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కలిసి కట్టుగా పనిచేసి అభివృద్ధిపథంలో దూసుకుపోదాం అని కేసీఆర్ ఇచ్చిన పిలుపును స్వాగతిస్తూ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికినట్టు తెలుస్తోంది.