తిరుపతి: సామాన్యులకు వీఐపి బ్రేక్ దర్శనం కల్పించాలని భావిస్తున్నట్టు వచ్చిన వార్తలను టీటీడీ కొట్టిపారేసింది. టీటీడీ శ్రీవాణి పథకానికి 10 వేల రూపాయల నిధిని విరాళంగా అందజేసిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీటీడీ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించినట్టుగా మీడియాలో వార్తా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. 


అయితే వాస్తవానికి అటువంటి విధానపరమైన నిర్ణయాలను టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చించి, సభ్యుల ఆమోదం పొందిన తర్వాతే బోర్డు అధికారికంగా ప్రకటిస్తుందని టీటీడీ వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుతానికి అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని టీటీడీ స్పష్టంచేసింది.