వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం జరిగిన కాపు పదకొండవ వార్షికోత్సవానికి ముద్రగడ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పి..  అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్ రూ.10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్ర సభలో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారని, ఇది కరెక్టు కాదన్నారు. 'మేము 20 వేల కోట్లు ఇస్తాం. ఇతర కులస్థుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా..' అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు ముద్రగడ. అటు వచ్చే ఎన్నికల్లో కాపుల  డిమాండ్లను పరిష్కరించే వారికే తాము పట్టం కడతామని స్పష్టం చేశారు.


ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్లపై మాట్లాడిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని.. కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని తెలిపారు. 50 శాతం దాటడంతో రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో లేదన్నారు. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మాటిచ్చి తప్పలేనని చెప్పారు. అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.