ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మరోసారి విమర్శలు చేశారు.  ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు కర్ణాటక ప్రజలకు బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని.. త్వరలోనే అవినీతి గురించి బయటపెడతామని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అర్థం వచ్చేలా విష్ణుకుమార్ మాట్లాడారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న విష్ణుకుమార్ రాజు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.


2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఏపీకి కాబోయే సీఎం అని అన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మకాం మార్చారని, బాబు పిలుపులను కర్ణాటక ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. తెలుగు, కన్నడ ప్రజల మధ్య విభేదాలు తలెత్తే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడి ఫ్యామిలీ తప్ప రాష్ట్రంలో మరెవరూ టీటీడీపీకి ఓట్లు వేయరని అన్నారు.  అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ తెలుగుదేశం పార్టీ అని, త్వరలోనే టీడీపీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు.