School Teacher's Love Letter to Minor Student: స్కూల్లో పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్.. నలుగురి చేత బుద్ది చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. తాను చదువు చెబుతున్న స్కూల్లోనే 8వ తరగతి చదువుకుంటున్న మైనర్ విద్యార్థినికి లవ్ లెటర్ రాశాడు. అంతటితో ఆగని ఆ బడి పంతులు.. ఎందుకిలా చేశావు అని ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు నిలదీయగా.. మీరు ఒప్పుకుంటే ఆ బాలికను పెళ్లి చేసుకుంటాను అని వాదిస్తున్నాడు. 47 ఏళ్ల వయస్సులో కూతురి లాంటి వయస్సున్న మైనర్ బాలికతో వెకిలి చేష్టలు చేస్తోన్న ఈ సర్కారు బడి పంతులుపై ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవ్ లెటర్‌లో ఏం రాశాడంటే..
సెలవులు వచ్చినప్పుడు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. సెలవుల్లో నిన్ను బాగా మిస్ అవుతున్నాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకే సెలవుల సమయంలో వీలు చూసుకుని ఫోన్ చేయగలవు. ఇంకా వీలైతే స్కూల్స్ రీఓపెన్ కావడానికంటే ముందు ఒకసారి నన్ను కలవడానికి ప్రయత్నించు. ఒకవేళ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టయితే.. తప్పకుండా నన్ను కలవడానికి వస్తావు. ఈ లెటర్ చదివిన వెంటనే ఎవ్వరికీ చూపించకుండా చించేయగలవు అని రాసుకొచ్చాడు.


టీచర్ నిర్వాకం ఎలా బయటపడింది..
టీచర్ తనకు రాసిన లవ్ లెటర్ చదివిన విద్యార్థిని.. ఆ లేఖను తల్లిదండ్రులకు చూపించింది. తన కూతురికి ప్రేమ లేఖ రాయడంపై అగ్గిమీద గుగ్గిలమైన విద్యార్థిని తల్లిదండ్రులు.. ఇదే విషయమై నేరుగా అతడి వద్దకే వెళ్లి నిలదీశారు. జరిగిన తప్పిదంపై క్షమాపణ కోరారు. అయితే, విద్యార్థిని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించిన సదరు స్కూల్ టీచర్.. వారితో కూడా వితండ వాదానికి దిగాడు. ఈ విషయం ఇంతటితో వదిలేయమని.. లేదంటే మీ కూతురుని కనిపించకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.  


పోలీసులను ఆశ్రయించిన విద్యార్థిని తల్లిదండ్రులు
టీచర్ బెదిరింపు దోరణి చూసిన విద్యార్థిని తల్లిదండ్రులు.. అతడిపై సదర్ కొత్వాలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్కూల్ టీచర్ తమ కూతురిపై వేధింపులకు పాల్పడుతున్నాడంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీచర్ హరిఓం సింగ్ నిర్వాకం తెలుసుకున్న జిల్లా విద్యా శాఖ అధికారి.. అతడిపై విచారణకు ఆదేశించారు. నివేదిక అందాకా టీచర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యా శాఖాధికారి తెలిపారు. టీచర్ నిర్వాకంపై ఉపాధ్యాయ సంఘాలు తలదించుకుంటున్నాయి. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే.. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తాము సైతం డిమాండ్ చేస్తున్నామని ఉపాధ్యాయ సంఘం నేత అనూప్ మిశ్రా తెలిపారు.