నటి పూనమ్ కౌర్‌కి ఏపీ చేనేతశాఖకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ పదవిని ఎవరిచ్చారు అని ఈ మధ్యకాలంలో చలనచిత్ర విమర్శకుడు కత్తి మహేష్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఇదే విషయంపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వివరణ ఇచ్చారు. తను చేనేతపరిశ్రమల శాఖకు మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఎవరినీ ఆ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని ఆయన స్పష్టం చేశారు.


అసలు ప్రభుత్వం ఆ విధంగా ఎవరినీ నియమించలేదని కూడా ఆయన తెలిపారు. అయితే గతంలో కొందరు చేనేత సంఘ ముఖ్యులు పవన్ కళ్యాణ్ ను కలిసి హ్యాండ్‌లూమ్స్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరినట్లు తనకు తెలిసిందని కూడా తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. అయితే నిన్న ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ సోదరుడే స్వయంగా తన సోదరి చేనేతశాఖకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తున్నట్లు.. ఆ పదవి ఆమె మెరిట్ ద్వారా వచ్చినట్లు తెలపడం గమనార్హం.