సినీ నటి త్రిషపై తమిళనాడు సినీపెద్దల వేదిక నడిగార్ సంఘంలో ఫిర్యాదు చేశారు నిర్మాత శిబు. విక్రమ్ కథానాయకుడిగా నటించిన ‘సామి 2’ చిత్రంలో నటించేందుకు తొలుత త్రిషను హీరోయిన్‌గా సంప్రదించారు. ఆమె కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాక డేట్స్ కుదరకపోవడంతో సినిమా నుండి తప్పుకున్నారు. అప్పుడు ఆమె స్థానంలోనే నటి కీర్తి సురేష్‌ను తీసుకోవాల్సి వచ్చిందట నిర్మాతలు. అయితే త్రిష సినిమా నుండి తప్పుకోవడం వల్ల తాము భారీ స్థాయిలో నష్టపోయామని.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు త్రిష స్పందించాల్సి ఉందని తెలిపారు నిర్మాత శిబు. ఎన్నిసార్లు ఈ విషయాన్ని ఆమెకు తెలిపినా.. తను పట్టించుకోలేదని అందుకే ఫిర్యాదు చేయడానికి సంకల్పించామని అన్నారు. ఆమెపై తగు చర్య తీసుకొనేందుకు నడిగార్ సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని కూడా తెలిపారు ఆయన. 2003లో వచ్చిన "సామి" చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న  ‘సామి 2' చిత్రాన్ని డైరెక్టర్ హరి దర్శకత్వంలో నిర్మిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.