ఇంతకాలంపాటు బయటి నుంచి ఔత్సాహిక యువకులను కొత్త హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు తన కుటుంబంలోంచే ఓ యువకుడిని హీరోగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ అప్‌డేట్స్ ప్రకారం దిల్ రాజు సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కే సినిమాలను పర్యవేక్షించే శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డిని దిల్ రాజు హీరోగా పరిచయం చేయనున్నట్టు సమాచారం.


ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అయ్యే సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అది కాస్తా పూర్తి కాగానే సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'పలుకే బంగారమాయెనా' అనే టైటిల్ సైతం ఖరారైనట్టు టాలీవుడ్ టాక్. ఆశిష్ సరసన జత కట్టనున్న హీరోయిన్ ఎవరు ? మిగితా నటీనటుల వివరాలన్నీ అధికారిక ప్రకటనలో పేర్కొనే అవకాశం ఉంది.