Sai dharam tej accident case, CCTV Video: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న శుక్రవారం రాత్రి 8:05 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి-ఐకియా చౌరస్తా మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఈ ప్రమాదం అనంతరం ఘటనాస్థలికి చేరుకుని సాయిధరమ్ తేజ్ నడిపిన స్పోర్ట్స్ బైక్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్కడి సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీని (Sai dharam tej accident visuals) పరిశీలించారు. కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో నిర్ధేశించిన వేగం కంటే మించిన స్పీడుతో సాయిధరమ్ తేజ్ బైక్ రైడింగ్ చేసినట్టు నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనా స్థలం రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగానే ఈ కేసు విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన చోట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు (Sai dharam tej accident CCTV visuals) సైతం బహిర్గతమయ్యాయి. 


అతి వేగం వల్లే బైక్ అదుపుతప్పి కిందపడినట్టు రాయదుర్గం పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించి ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేదంటే ప్రమాదం తీవ్రంగా ఇంకా ఎక్కువగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. 


ఇదిలావుంటే, మరోవైపు ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అతడు చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఓ హెల్త్ బులెటిన్ (Sai dharam tej health condition) విడుదల చేశారు.