దక్షిణాదిన సినీ పరిశ్రమకు పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌లో మకుటం లేని మహరాణిలా దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు రెండు తరాలకు చెందిన అగ్రహీరోలతో సినిమాలు చేసిన శ్రీదేవికి దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా అభిమానులు వున్నారు. అందుకే ఆమె అకాల మృతిని ఆ అభిమాన ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. శ్రీదేవి సన్నిహితమిత్రులు, పరిశ్రమ ప్రముఖులు ఆమెతో తమకు వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, శ్రీదేవి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శ్రీదేవిని చివరిసారిగా కలిసిన సందర్భాలు గుర్తుచేసుకుంటున్న ఇంకొంతమంది.. ఉన్నట్టుండి శ్రీదేవి ఇలా తమను విడిచివెళ్లిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు అని కన్నీటి పర్యంతమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవన్నీ ఇలా వుంటే, శ్రీదేవికి సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దుబాయ్‌లో తన మేనల్లుడు మోహిత్ మర్వ పెళ్లికి వెళ్లిన శ్రీదేవి కుటుంబం అక్కడ వివాహ వేడుకలో చాలా సరదాగా గడిపినట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో బోనీ కపూర్ తమ్ముడు, తనతో కలిసి మిస్టర్ ఇండియా సినిమాలో నటించిన సహనటుడు అయిన అనిల్ కపూర్‌తో శ్రీదేవి సరదాగా స్టెప్పేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వతగాహానే భరతనాట్యం లాంటి సంప్రదాయ నృత్యాల్లో పట్టున్న శ్రీదేవి సినిమాల్లోనూ స్టెప్పులేయడంలో నటులతో పోటీపడేది అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే శ్రీదేవి చివరిసారిగా స్టెప్పేసిన ఈ వీడియోలోనే ప్రస్తుతానికి అభిమానులు ఆమెని చివరిచూపు చూసుకుంటున్నారు.