శ్రీదేవి ఇక లేదనే దుర్వార్తను ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2012లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం కన్నా ముందే దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు బాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించిన శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లి అక్కడ ఉన్నట్టుండి గుండెపోటుతో మృతిచెందిన శ్రీదేవి అకాల మరణం అభిమానులని శోకసంద్రంలోకి నెట్టింది. అయితే, ఇదే సందర్భంలో శ్రీదేవి కనిపించిన చివరి సందర్భం ఇదేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

టాలీవుడ్ మూవీ రివ్యూ రైటర్ కత్తి మహేష్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్న ఈ వీడియోలో శ్రీదేవి ఓ ఈవెంట్‌లో తనకు తెలిసిన వారిని పలకరిస్తూ, వారిని విష్ చేస్తూ ముందుకు సాగడాన్ని ఇక్కడ గమనించొచ్చు. బహుశా శ్రీదేవి చివరిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యం ఇదే అయ్యుంటే, అది దుబాయ్‌లో ఆమె హాజరైన వివాహ వేడుకకు సంబంధించిన ఫంక్షన్‌లోనే అయ్యుంటుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఇక శ్రీదేవిని మళ్లీ మనం వీడియోల్లోనే తప్ప ప్రత్యక్షంగా చూడలేం కదా అని ఆవేదనకు గురవుతున్న ఆమె అభిమానులు అందరూ ప్రస్తుతం ఈ వీడియో చూస్తూ అందులో వున్న శ్రీదేవిని తమ జ్ఞాపకాల్లో పదిలపర్చుకుంటున్నారు.