ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ ట్రాఫిక్ పోలీస్‌గా మారారు. రోడ్ల మీద వాహనాలకు డైరెక్షన్స్ ఇస్తూ  ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. జాకీ ష్రాఫ్‌ ప్రస్తుతం ‘ప్రస్థానం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతోంది. షూటింగ్‌కు కారులో వెళుతుండగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు జాకీ కారు దిగారు.  ట్రాఫిక్ పోలీస్ వలే  వాహనాలకు డైరెక్షన్స్ ఇస్తూ జాగ్రత్తగా మళ్లించారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను జాకీ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘లక్నోలో ట్రాఫిక్‌ కంట్రోల్‌’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


తెలుగులో సాయికుమార్‌, శర్వానంద్‌ నటించిన ‘ప్రస్థానం’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో జాకీతో పాటు సంజయ్‌ దత్‌, మనిషా కొయిరాలా, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్నారు. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన దేవ కట్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సంజయ్ దత్ తల్లి, దివంగత నటి, నర్గీస్ దత్ జయంతి రోజు జూన్ 1, 2018న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. అస్త్రం, పంజా వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన జాకీ ష్రాఫ్‌ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న‘సాహో’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.