వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా ద‌ర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తెరకెక్కిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌లో, సోనుసుద్ సదాశివ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు, దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొనసాగుతున్నది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ యూనిట్ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌‌ను విడుదల చేసింది. అచ్చం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌లా.. యుద్ద సన్నివేశాల్లోని కంగనా గుర్రపు స్వారీ ఫోజ్‌ ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలా కీలకం. ఇందుకోసం హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రఫర్ నిక్ పావెల్‌ను రంగంలోకి దింపారని సమాచారం. ఈయన 300 యోధులు, బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ వంటి సినిమాలకు పనిచేశారు.



 



 


మార్చిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా.. శంకర్- ఎహసాన్- లాయ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.


అటు క్రిష్ తెలుగులో 'ఎన్టీఆర్ బయోపిక్' కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.