ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ చేసిన పని తనకు నచ్చలేదని.. తనకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కే ప్రాణం ఉన్నంతవరకూ సపోర్టు ఇస్తానని ఆయన అన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక కారణం తానేనని రామ్ గోపాల్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడైతే వర్మ ఆ విషయాన్ని బహిర్గతం చేశారో కొన్ని వేలమంది పవన్ ఫ్యాన్స్ ఆయనపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో బూతుల వర్షం కురిపించారు. ఆ తర్వాత వెంటనే వర్మ పవన్‌కు సారీ చెప్పారు. ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే వర్మపై తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచిన పవన్ మెగా హీరోలు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌లతో కలిసి రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు చేయడానికి ఫిలిం ఛాంబర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో పూరీ జగన్నాధ్ కూడా తన మద్దతు పవన్‌కే అని తెలిపారు


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అదే పూరీ జగన్నాథ్ తాను వర్మను గురువుగా భావిస్తానని కూడా తెలిపారు. పలు ఇంటర్వ్యూల్లో ఆయనను పొగిడారు కూడా. కానీ అదే పూరీ జగన్నాధ్ ఇప్పుడు పవన్‌కు మద్దతు ప్రకటించడం విశేషం. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి "మెహబూబా" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ వద్ద పూరీ జగన్నాధ్ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా గతంలో పనిచేశారు.